MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:25 am Posted by : MANA TOLIVELUGU

జర్నలిజం ముసుగులో ప్రభుత్వ భూమి కబ్జా..!

కబ్జా భూమిలో పంద్రాగస్టు వేడుకలు.. అధికారుల మౌనం ఎందుకు?

మన తొలివెలుగు రంగారెడ్డి జిల్లా: జర్నలిజం ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న భూమిలోనే పంద్రాగస్టు వేడుకలు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ భూమితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు రాజకీయ, అధికార వర్గాల అండదండలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి చెందిన పీఏ, పీఆర్ఓ, డ్రైవర్లు ఈ కబ్జా భూమిలో ఉన్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. అదే సమయంలో కబ్జాదారులకు మల్‌రెడ్డి రంగారెడ్డి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

₹.1,500 కోట్ల భూకబ్జా ఆరోపణలు?

ఈ వ్యవహారం వెనుక సుమారు రూ.1,500 కోట్ల విలువైన భూకబ్జా వ్యవహారం ఉందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఒక ఐఏఎస్ అధికారి, ఇబ్రహీంపట్నం మాజీ ఆర్డీవో, అబ్దుల్లాపూర్‌మెట్ మాజీ మహిళా తహసీల్దార్‌తో పాటు పలువురు రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకుల మధ్య భూముల పంపకాలు జరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఎవరి పాత్ర ఎంత? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

అధికారులు ఏం చేస్తున్నారు?

ప్రభుత్వ భూమి అని ఆరోపణలు వస్తున్నప్పటికీ అక్కడ పంద్రాగస్టు వేడుకలు జరగడం రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ఆదిభట్ల మున్సిపల్ అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ఎవరిది? కబ్జా ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భూమి రికార్డుల్లో అసలు హక్కుదారు ఎవరు? పంద్రాగస్టు వేడుకలకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

హైడ్రా కమిషనర్ సాబ్.. ఎక్కడ?

ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై చర్యలు తీసుకోవాల్సిన హైడ్రా దృష్టికి ఈ వ్యవహారం వెళ్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఆరోపణలు నిజమైతే ప్రభుత్వ భూమిని కాపాడేందుకు వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి, రికార్డులను పరిశీలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రూ.1,500 కోట్ల భూకబ్జా ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశిస్తుందా? లేక అధికారుల మౌనం కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.