ప్రొసీడింగ్ అందజేసిన డీఈఓ విజయలక్ష్మి
మన తొలివెలుగు, ఆలంపూర్ నియోజకవర్గ ప్రతినిధి డేవిడ్ :
జోగులాంబ గద్వాల జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించుటకు జిల్లా విద్యాశాఖ అధికారిని విజయలక్ష్మి ప్రొసీడింగ్స్ ను బుధవారం జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అనేక మంది జర్నలిస్టులు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, పత్రికలు, టీవీ యాజమాన్యాల నుంచి తగిన ఆర్థిక సహాయం అందకపోవడంతో కుటుంబ పోషణతో పాటు పిల్లల విద్యాభారం మోయడం కష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో జర్నలిస్టుల పిల్లల చదువులు కొనసాగించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారి పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని డీఈఓను కోరాగా జర్నలిస్టు పిల్లలకు ఒకరికి ఉచితంగా, మరొకరికి 50 శాతం ఫీజులో రాయితీ ప్రొసీడింగ్ ను జర్నలిస్టులకు అందజేశారు. ప్రొసీడింగ్ కాఫీ, అక్రిడేషన్ కార్డు జిరాక్స్ కాపీలను సంబంధిత పాఠశాలలో ఇవ్వాలని, ఈ అవకాశాన్ని ప్రతి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు లు పెద్ద ఇస్మాయిల్, ముకుందరావు, బలరాం, కృష్ణ, మహేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.