MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 7:17 pm Posted by : MANA TOLIVELUGU

జూన్ 9 లోపు ఎట్టి పరిస్థితుల్లో జనగణన పూర్తి చేయాలి

మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

జనగణనలో సూపర్వైజర్ లు, ఎన్యూమరేటర్ల పాత్ర ఎంతో కీలకమని డిప్యూటీ కమిషనర్ , ఇంఛార్జి అధికారి బీ. వెంకట్ రామ్ తెలిపారు. జల్ పల్లి సర్కిల్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించి, వారు కోరిన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఇది దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని, ప్రజలు అందించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని పేర్కొన్నారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎన్యూమరేటర్ తప్పని సరిగా ప్రతి గృహాన్ని సందర్శించి వివరాలను పారదర్శకంగా సేకరించి, వాటిని గోప్యంగా ఉంచాలని సూచించారు. అలాగే ఎన్యూమరేటర్లు సేకరించిన సమాచారాన్ని సూపర్వైజర్ లు ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే నిర్ధారించాలని తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్ రోజుకు కనీసం 40 గృహాల వివరాలు నమోదు చేయాలని, వాటిని సూపర్వైజర్లు వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు జూన్ 9 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకట్ రామ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బీ. వినయ్ కుమార్, ఫీల్డ్ ట్రైనర్ విజయ్ భాస్కర్ రెడ్డి, సిబ్బంది మధుసూదన్ రెడ్డి, శాంతి కుమార్, అభిరామ్, లోకేష్, నవీన్, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.