MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:54 pm Posted by : MANA TOLIVELUGU

త్రాగునీరు లీకేజీ అయి డ్రైనేజ్ లో కలుస్తున్నా పట్టించుకోరా..?

జగద్గిరిగుట్ట ముక్దుం నగర్ పోలాల బస్తీ చౌరస్తాలో అధికారుల నిర్లక్ష్యం 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :

జగద్గిరిగుట్ట ముక్దుం నగర్ పోలాల బస్తీ చౌరస్తాలో త్రాగు నీటి పైప్ లైను లీక్ అయ్యి డ్రైనేజీ లైన్ తో కలుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఈ మేరకు మురికి నీటి సమస్య గురించి, వాటర్ వర్క్, శానిటేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించు కున్న పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో శ్రీలక్మి వెంకటేశ్వర దేవస్థానం స్థలంలో ఉన్నటువంటి యోగ పాఠశాల కాంపౌండ్ వాల్ ప్రక్కన నుండి త్రాగు నీరు లీకేజీ అయి అందులో ఉన్న డ్రైనేజ్ లో కలిసి గత కొంత కాలంగా శ్రీ శివ సీత రామాంజనేయ టెంపుల్ ముందు నుండి ముక్దుం నగర్ చౌరస్తా వరకు సెలయేరు లాగా పారుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే డ్రైనేజ్ సమస్య అయితే మెయిన్ రోడ్ నుండి మొదలుకుంటే అన్ని గల్లిలు పొంగి పొర్లుతున్నాయి. దీనిపై ఎన్ని సార్లు వారికి కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోకపోవడంలో అధికారుల ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నీరు వలన పాదాచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి వాహనాలు స్కిడ్ అయ్యి వాహనదారులు కింద పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీ సమస్యను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.