MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 6:46 pm Posted by : MANA TOLIVELUGU

నెలల తరబడి కొనసాగుతున్న రోడ్డు పనులు

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

ఛత్రినక చౌరస్తా నుండి ఉప్పుగూడ వెళ్ళే ప్రధాన రహదారిలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న మరమ్మత్తు పనుల వల్ల స్థానికులు, వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పూర్తిగా తొవ్వడంతో, రాళ్లు, మట్టి కుప్పలు పడి ఉన్నాయి. కాంట్రాక్టర్లు చేస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధూళి, దుమ్ము, బురద వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

రోడ్డు పక్కన ఉన్న షాపులు, ఇతర వ్యాపారాలకు కస్టమర్స్ రాక ఆదాయం దెబ్బతింటోంది. వృద్ధులు, మహిళలు రోడ్డు దాటేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు, తాత్కాలిక పాదచారుల దారి ఏర్పాటు చేయాలని, ఆలస్యానికి కారణమైన కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఏంసీ అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.