తెలంగాణ రాజ్యాధికార పార్టీ ధర్నా
మన తొలివెలుగు భువనగిరి రూరల్ ప్రతినిధి కే. నాగమణి (29 జులై 2026) :
భువనగిరి పట్టణం నుండి రామకృష్ణాపురం, రామచంద్రాపురం, పెంచికల్పాడు, చందుపట్ల, కుమ్మరిగూడెం, బండ సోమారం తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రతిరోజూ నేషనల్ హైవేను దాటాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భువనగిరికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. తీన్మార్ మల్లన్న సహకారంతో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ నాయకుడు తాళ్లపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పక్క నియోజకవర్గాల్లో నేషనల్ హైవేపై బ్రిడ్జిలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం, భువనగిరి నియోజకవర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేరే వరకు ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎం.డి సోయల్, సాజిద్, బాజా కృష్ణ, బాజా మణితో పాటు రామకృష్ణాపురం, రామచంద్రాపురం, పెంచికల్పాడు, చందుపట్ల, కుమ్మరిగూడెం, బండ సోమారం తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.