శేషాద్రి నగర్లో రూ. 87 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ నాదర్గుల్ 57వ డివిజన్ శేషాద్రి కాలనీలో రూ. 87 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి కాలనీని దశలవారీగా అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పలు హామీల అమలులో విఫలమైందని విమర్శించిన ఎమ్మెల్యే , ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా చూడాలని, ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే అందరి లక్ష్యంగా ఉండాలని ఆమె హితవు పలికారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సీసీ రోడ్డు పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలనీల్లో ముంపు సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థలను పటిష్టపరచాలని, చెత్తాచెదారం, పూడికను తొలగించి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, రామిడి రామ్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, తుఫాన్ రెడ్డి, సరిత, సరితా రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మహేందర్ రావు, దోనూరి శ్రీనివాస్ రెడ్డి, సునీత బాలరాజ్, బిందు, పంతంగి మాధవి, లలిత జగన్, శేషాద్రి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాస సోమయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్ నరేందర్, శంకర్ రాకేష్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.