కనీస వసతులు లేని చోట డిజిటల్ విప్లవం ఎలా సాధ్యం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘విద్యా వారోత్సవాలు’ కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యాయని వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ హమేద్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విద్యాశాఖ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా షర్ఫుద్దీన్ హమేద్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక అల్లాడుతుంటే, ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో రంగుల వేడుకలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీలకు ప్రభుత్వం నేటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా కేవలం స్థానిక కమిటీలపై ఒత్తిడి తెచ్చి అరకొర పనులు చేయించారన్నారు. వర్షకాలం వస్తున్నా చాలా బడుల పైకప్పుల మరమ్మతులు పూర్తి కాలేదని, కేవలం గోడలకు రంగులు వేసి అంతా బాగుందని భ్రమ కల్పిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు లేని బడిబాట బూటకం. జిల్లా వ్యాప్తంగా వందలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సిబ్బంది లేని బడుల్లో అడ్మిషన్లు పెంచి విద్యార్థుల భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎన్నో ప్రాథమిక పాఠశాలల్లో కనీసం కరెంట్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం లేదని.. కనీస వసతులు లేని చోట డిజిటల్ విప్లవం ఎలా సాధ్యమని నిలదీశారు. ఫ్లెక్సీలు, ప్రకటనల కోసం తగలేసిన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బడుల శాశ్వత నిర్వహణకు, ఆయాల జీతాలకు ఎందుకు కేటాయించలేదని దుయ్యబట్టారు. రంగుల వేడుకలు ఆపి, తక్షణమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో మరమత్తులు చేయించాలని, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని, మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.