బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన పనులను ప్రారంభించడం తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదు
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్ ను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాచుపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలసత్వాన్ని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించినందుకే ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చిందన్నారు.
ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షాన కొట్లాడి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, ముఖ్యమంత్రి ఆగ మేఘాల మీద శంకుస్థాపనలు చేసి ఎక్కడో మియాపూర్ లో ఉంటూ బాచుపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించడం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమే అని అన్నారు. ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు హెచ్ – సిటీ అంటూ పేరు మార్చడం తప్పా చేసింది ఏం లేదని, ఈ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన ఇప్పటి వరకు సుచిత్ర – కొంపల్లి ఫ్లైఓవర్ పనులను పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం నేపాన్ని నెట్టివేసి చేతులు దోచుకుంటున్నారే తప్పా చేసిందేమీ లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన ఊహల నగరమైన ఫోర్త్ సిటీని ప్రచారం చేస్తూ ఉన్న నగరాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే రక్ష అని ఆయన అన్నారు.