మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
వడ్డీ లేని రుణాలు ప్రభుత్వ ప్రచారానికే పరిమితమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆర్పీల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆర్పీలు మాట్లాడుతూ.. గత 5 నెలలుగా తమకు జీతాలు అందడం లేదని, సర్వే నిర్వహించినందుకు రావాల్సిన పారితోషికం కూడా ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. రూ.5 లక్షలు మంజూరైనప్పటికీ ఒక్క రూపాయి కూడా అందలేదని తెలిపారు. అదేవిధంగా మైక్రో క్రెడిట్ ప్లాన్ యాప్ను తరచూ మార్చడం వల్ల లోన్లు సకాలంలో అందించడం కష్టమవుతోందని చెప్పారు. అభయ హస్తం ద్వారా రావాల్సిన నిధులు కూడా ఆలస్యంగా అందుతున్నాయని, దీనివల్ల ప్రజలు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పావలా వడ్డీ రుణాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, గడిచిన 5 నెలలుగా ఎలాంటి రుణాలు ప్రజలకు అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన వడ్డీలేని రుణాలు కూడా అందడం లేదని ఆర్పీలు పేర్కొన్నారు. దీంతో ప్రజలు తమనే ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శ్రీనిధికి సంబంధించిన సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్పీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమీషనర్ళను సమ్మయ్య ను ఆదేశించారు. అభయ హస్తం నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం పై జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డీపీఓ అశ్విని, యూనియన్ నాయకురాలు మంజుల, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.