MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 1:39 pm Posted by : MANA TOLIVELUGU

రహదారులపై మురుగు నీటితో నరకయాతన పడుతున్న శ్రీరామ కాలనీ వాసులు

ప్రజా పాలనలో.. ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రవర్తిస్తున్న జీహెచ్ఎంసీ జల్ పల్లి సర్కిల్ అధికారులు

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

పైన పటారం.. లోన లొటారం.. అంటే ఇదేనేమో. శ్రీరామ కాలనీ చూడడానికి ఒక అందమైన సిటీ మాదిరిగా కనిపిస్తుంది. అందమైన భవంతులు కనిపిస్తాయి. ప్రధాన రహదారిపై దుకాణాలు, హోటల్స్, పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఏ సమస్యలు లేనట్టుగా అనిపిస్తుంది. కానీ కాలనీ, బస్తీలలో రహదారులు అస్తవ్యస్తంగా మురుగుతో నిండి పోయి దర్శనమిస్తాయి. రోడ్లపై మురుగు మీరు ఏరులై పారుతుంది. మురుగునీరు రహదారులపై నిలిచిపోయి బురదమయంగా మారడంతో పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయి. స్థానిక కాలనీవాసులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

బల్దియాలో విలీనమైన మారని తీరు..

జల్ పల్లి మున్సిపాలిటీ ఇటీవలే జీహెచ్ఎంసీ విలీనమైంది. అయినా అక్కడి పరిస్థితులు, సమస్యలు మాత్రం మారడం లేదు. శ్రీరామ్ కాలనీ పరిసరాల్లో పాత డ్రైనేజీ పైపులైన్లు తరచుగా పగిలి పోవడంతో, డ్రైనేజీలలో చెత్తాచెదారం నిండి మ్యాన్ హోళ్ళు నుండి మురుగు నీరు బయటకు వచ్చి ప్రధాన రహదారుపై ప్రవహిస్తుంది. దీంతో ప్రయాణికులు, కాలనీళవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్లన్నీ అస్తవ్యస్తం

రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో రహదారులపై మురుగునీరు నిల్వ చేరి బురదమయంగా మారింది. డ్రైనేజీ నీరు కావడంతో కంపు భరించలేక స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రహదారిలో నడవాలన్నా, ద్విచక్ర వాహనాలపై వెళ్ళాలన్నా ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ప్రమాదవశాత్తు ఆ రహదారిలో వెళ్లేటప్పుడు జారి కింద పడితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్వాసన తీవ్రంగా వెదజల్లుతోంది.

గత పది రోజులుగా నరకయాతన 

గత పది రోజుల నుంచి నిత్యం ఇదే నరకం ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కడుతున్న టాక్స్ పైసలు జీతాలతో తీసుకుంటున్న అధికారులకు సమస్యలు పట్టవా.. అని ప్రశ్నిస్తున్నారు. కాలనీవాసులు తీవ్రమైన మురికినీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంటే స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు గుడ్డి గాడిద పళ్ళు తోముతున్నారా.. అని మండిపడుతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించకుంటే జీహెచ్ఎంసీ జల్ పల్లి సర్కిల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిస్తూ, ఆమరణ నిరాహారదీక్ష కు వెనకాడమని పలువురు స్థానిక వాసులు స్పష్టం చేశారు.