మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఓటరు జాబితా అత్యంత అవసరమని, అందుకు ప్రతి పౌరుడు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బాధ్యతాయుతంగా సహకరించాలని డిప్యూటీ కమిషనర్ వీ. సమ్మయ్య కోరారు. బడంగ్పేట్ సర్కిల్-16లో ఎస్ఐఆర్ కార్యక్రమంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ వీ. సమ్మయ్య బడంగ్పేట్ సర్కిల్-16 కార్యాలయంలో జూన్ 15 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతమైన నిర్వహణకు సంబంధించి సమ్మయ్య అధ్యక్షతన వివిధ పార్టీల రాజకీయ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం, తప్పులు సరి దిద్దడం, మార్పులు, చేర్పులు సమయానికి పూర్తి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, తమ తమ ప్రాంతాల్లో ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమం గురించి వివరించి సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ వివరాలను సక్రమంగా అందించి, ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు కార్యక్రమానికి సంబంధించిన పలు సూచనలు అందజేయడంతో పాటు, ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అత్యంత అవసరమని, అందుకు ప్రతి పౌరుడు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా సహకరించాలని డిప్యూటీ కమిషనర్ వీ. సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్, మీర్ పేట్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, అర్కల కామేష్ రెడ్డి, మీర్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముఖేష్ ముదిరాజ్, నాదర్ గూల్ డివిజన్ అధ్యక్షుడు వీర కర్ణా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గిరి ముదిరాజ్, నీరుడు శ్రీరాములు, ఉమేష్ , బీఎల్ఓ సూపర్వైజర్ లు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

