కొత్తపేటలోని పాత కోర్టు స్థలం వేలం ఆపండి
లేనిచో ప్రజా ఉద్యమం తప్పదు
తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక
మన తొలివెలుగు రంగారెడ్డి బ్యూరో: సరూర్ నగర్ సర్వే నెంబర్ 9/1 P గల 4350 గజాల హెచ్ఎండిఏ స్థలాన్ని సెప్టెంబర్ 7వ తేదీన వేలం వెయ్యడాన్ని తక్షణమే నిలిపివేయాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేటలోని పాత కోర్ట్ స్థలం (హెచ్ఎండిఏ స్థలం) ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గోర శ్యాంసుందర్ గౌడ్, కార్యదర్శి కేకే, ఉపాధ్యక్షుడు జిట్టా ఆయిల్ రెడ్డి, కొమ్ము అంజి, భాస్కర్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కేవీ గౌడ్, ఉపాధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, హైదరాబాద్ రీజనల్ ఇంచార్జి వరంగల్ రమేష్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి వడ్డెర రఘుపతి, క్రుపా చారి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ఎంఎస్ యాదవ్, స్పోక్స్ పర్సన్ చిత్తలూరి వేణు గౌడ్, దివ్యాంగుల విభాగం కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ భూములు వేలం వేస్తూనే ప్రజలపై అప్పుల భారం వేస్తుందని ఆరోపించారు. కొత్తపేటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయకుండా ఆ స్థలంలో మహాత్మ పూలే భవనం 20 అంతస్తులలో నిర్మించాలని అందులో లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, ఆడిటోరియం వంటివి నిర్మించి అద్దె భవనాలలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఇక్కడికి తరలించవచ్చని వారు తెలిపారు. కానీ ప్రజలపై అప్పుల భారం మోపుతూ.. ప్రభుత్వ భూములు అమ్మడం ప్రజా వ్యతిరేక పాలన అవుతుందని వారు ఆరోపించారు. ఈ కోర్టు స్థలం వేలాన్ని ఆపకపోతే ఎల్బీనగర్, మహేశ్వరం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి ప్రజా సంఘాలను, అఖిలపక్ష రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయబండి పాండురంగాచారి, మండల డానియల్ స్థానిక ఉద్యమకారులు పాల్గొన్నారు.

