అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన సిల్వేరి సాంబశివ
మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (30 జూలై 2026) :
ప్రతి ఒక్క ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారంను పూర్తిగా, సరైన వివరాలతో నింపి సంబంధిత బీఎల్ఓల కు తప్పనిసరిగా అందజేయాలని లేనిపక్షంలో ఓటరు జాబితా నుండి పేరు తొలగించబడే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సిల్వేరి సాంబశివ తెలిపారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ 62వ డివిజన్, బూత్ నంబర్లు 310, 311, వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. సంబంధిత బీఎల్ఓలను కలిసి ఇప్పటి వరకు ఎన్ని ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి అయ్యాయి, ఎన్ని ఫారాలు పెండింగ్లో ఉన్నాయి, చిరునామా (ఆచూకీ) లభించని ఓటర్ల సంఖ్య ఎంత అనే వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిల్వేరి సాంబశివ మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉండాలంటే తప్పని సరిగా వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత బీఎల్ఓలకు ఇవ్వాలన్నారు. అంతేకాకుండా, ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి లేదా ఫోన్ ద్వారా సంప్రదించి వారికి అవగాహన కల్పించి, మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాలు కూడా త్వరితగతిన గడువు లోపల పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే షిఫ్టింగ్, డెత్ కేటగిరీల్లో ఫారాలను మ్యాపింగ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తుల వివరాలను పూర్తిగా పరిశీలించి, స్థానికంగా నిజా నిజాలను నిర్ధారించుకున్న తర్వాతే నమోదు చేయాలని బీఎల్ఓలకు సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనుప ఠాకూర్, బీఎల్ఓ కాల్వ శ్రీకాంత్, పృద్వి, ఠాకూర్ సంజయ్ సింగ్, సీహెచ్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

