మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టాపనకు భువనగిరి పట్టణంలోని రైతు బజార్, అమరవీరుల స్థూపం పక్కన స్థలాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం అధికారికంగా ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లి లలితక్క మలిదశ తెలంగాణ ఉద్యమం లో తన గళంతో ప్రజలను, యువతను చైతన్యపరిచి, ఊరూర తెలంగాణ ఉద్యమ బావ జలాన్ని వ్యాప్తి చేసిందని సేవలను కొనియాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమం లో ఆమె ప్రాణ త్యాగం మరువలేనిదని, బెల్లి లలితక్క విగ్రహాన్ని భువనగిరి నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం మన అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద అమరవీరుల స్థూపం పక్కన బెల్లి లలితక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అందరి ఆమోదం తో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 26న ఆమె 27వ వర్ధంతిని పురస్కరించుకుని, అదే రోజున అత్యంత ప్రతిష్టాత్మకంగా విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ గడ్డ భువనగిరిలో లలితక్క విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని కేటాయించడం పట్ల తెలంగాణ ప్రజానికం, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ సమన్వయ కర్తలు సూర్య ప్రకాష్, జన్ని వెన్నెల, మున్సిపల్ చైర్మెన్ తంగెళ్ల పల్లి శ్రీవాణి రవి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, కౌన్సిలర్లు తుమ్మేటి పాండు , తోటకూరి విజయ వెంకటేష్, బొంతల నరసింహ రావు, మాజీ కౌన్సిలర్ ఉదరి లక్ష్మీ సతీష్, వడిచర్ల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.

