ఫలక్నుమాలో అమావాస్య సందడి
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి నార్కెట్పల్లి శైలేష్ కుమార్ :
అమావాస్య సందర్భంగా ఫలక్నుమా కాళీమాత ఆలయం వద్ద వేలాది మంది భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే చాంద్రాయణగుట్ట చౌరస్తా నుండి భక్తులు లైన్లో గంటల తరబడి వేచి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజు కాళీమాతను దర్శించుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకంతో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భక్తుల రద్దీతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమయ్యారు. రాత్రి 11 గంటల వరకు కూడా భక్తుల రాక సాగుతుందని చెప్పుకొచ్చారు. ప్రత్యేక పూజలు, హారతులతో అమావాస్య వేడుకలు ఘనంగా ముగిశాయి.

భక్తుల ఆవేదన
వాలంటీర్గా చలామణి అవుతూ భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దర్శనం త్వరగా చేయిస్తా, ప్రత్యేక పూజ చేయిస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను టార్గెట్ చేసి, కమిటీ వాలంటీర్నని ప్రత్యేక దర్శనం, అర్చన పేరుతో ₹ 100 నుంచి ₹ 500 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపించారు. దర్శనం తరావత బొట్టు పెట్టాలన్న, దారం కట్టాలన్న , నిమ్మకాయలు ఇవ్వాలన్న చేతులు తడపాక తప్పదంటున్నారు, కానీ ఆలయ సిబ్బంది దీని గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలు ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, భక్తులు భయపడి రావడం మానేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్స్ లోనే ఉండడం జరుగుతున్న తెలిసిన వాళ్ళును ముందు నుండి పంపడం జరుగుతుందని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ అధికారులు వెంటనే స్పందించి, నకిలీ వాలంటీర్లను గుర్తించి, భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చాంద్రాయణగుట్ట పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

