ఛత్రినాక చౌరస్తాలో జీహెచ్ఎంసీ పనుల వల్ల ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్
గుంతల్లో వాహనాలు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు
తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టిన ట్రాఫిక్ పోలీస్
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్
పాతబస్తీలో రోడ్డు విస్తరణ పనులు నత్తను తలపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఛత్రినాక చౌరస్తా వద్ద కొనసాగుతున్న జీహెచ్ఏంసీ డ్రైనేజీ మరియు రోడ్ మరమ్మత్తు పనుల కారణంగా ప్రతి రోజు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రద్దీ సమయంలో చౌరస్తా దాటేందుకు 15 -20 మినిషాలు పడుతోంది. స్కూల్ బస్సులు, అంబులెన్స్లకు కూడా దారి లేక ఇబ్బందిగా మారింది. పాదచారులు నడవాలన్న రోడ్లపై బురద పేరుకుపోయి నడవలేకపోతున్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయంమై మన తొలివెలుగు ప్రతినిధి శైలేష్ కుమార్ నేరుగా చార్మినార్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కే. లక్ష్మణ్, ఛత్రినక ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. సంతోషం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు స్వయంగా స్పాట్ను పరిశీలించారు.

రోడ్లపై పేరుకుపోయిన బురద నీరు నిల్వ ఉండడాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీస్ అధికారులు టిప్పర్ల ద్వారా తాత్కాలికంగా మట్టి పోయించి రోడ్డును వినియోగంలోకి తెచ్చారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా సమస్య పరిష్కారమైన, వీలైనంత త్వరగా సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ చార్మినార్ సర్కిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఇఇ) ఉషతో చర్చించారు. పనులను రాత్రి సమయంలో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన పోలీస్ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

