జిల్లెలగూడ కమలానగర్లో ఘనంగా ముగిసిన వేసవి కరాటే శిక్షణ
విజేతలకు బహుమతుల ప్రదానం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కరాటే సాధన వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా విద్యార్థినిల ఆత్మ రక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మాజీ కార్పోరేటర్ మాదరి సురేఖ అన్నారు. జిల్లెలగూడ కమలానగర్ కాలనీలోని బీ.ఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేసవి కాల కరాటే శిక్షణ కార్యక్రమం ఆదివారంతో అత్యంత ఘనంగా ముగిసింది. గ్రాండ్ మాస్టర్ జి. నాగరాజు, మాస్టర్స్ శివ, మంజునాథ్, సంగీత ల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ వేసవి శిక్షణలో స్థానిక చిన్న పిల్లలు, యువతీ యువకులు అత్యంత ఉత్సాహంతో, భారీ సంఖ్యలో పాల్గొని కరాటే మెళకువలను నేర్చుకున్నారు. శిక్షణ ముగింపు సందర్భంగా విద్యార్థుల ప్రతిభను నిరూపించేందుకు ప్రత్యేకంగా కరాటే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ కార్పోరేటర్ మాదరి సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వేసవి కాలంలో పిల్లల కోసం ఇలాంటి అద్భుతమైన కరాటే శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రాండ్ మాస్టర్, మాస్టర్స్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఎంతో శ్రద్ధతో వచ్చి కరాటే నేర్చుకున్న విద్యార్థుల క్రమ శిక్షణను ఆమె అభినందించారు. అందరూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని బహుమతులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కరాటే అభ్యాసం వల్ల భయం పోయి, ఆత్మగౌరవం, కాన్ఫిడెన్స్ పెరుగుతాయన్నారు. నేటి కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడానికి కరాటే ఒక గొప్ప ఆత్మరక్షణ సాధనం. ఆపద సమయంలో తమను తాము రక్షించుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ ముగింపు వేడుకలో కరాటే మాస్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు , కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

