ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామాల్లో నెలకొన్న రోడ్ల, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులను చేపట్టాలని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించాలనీ దావూద్గూడ గ్రామ ఉపసర్పంచ్ ఆర్. తేజనాయక్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతోందన్నారు. విద్యార్థులు, రైతులు, వృద్ధులు అత్యవసర సేవలు పొందే ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు సరిపడా నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేసి, అదనపు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామీణ రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి, రోడ్ల మరమ్మతులు మౌలిక వసతుల అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

