మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తూ, గత పదేళ్లలో చేయని విధంగా రైతులకు అనుకూలమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి గరిష్టంగా 48 గంటల లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కొనుగోలు కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు.
మూసి పరివాహక ప్రాంతం కావడంతో కొంతమేర తాలు సమస్య ఉన్నప్పటికీ, అధికారుల సమన్వయంతో దాన్ని సమర్థంగా అధిగమిస్తున్నామన్నారు. ఎఫ్ సి ఐ, సివిల్ సప్లైయిస్ శాఖలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం జిల్లాలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి భువనగిరి నియోజకవర్గంలోనే నమోదవుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు.
రైతులు అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల కొన్నిచోట్ల తాలు శాతం పెరగడంతో మిల్లర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 3-7 శాతం తాలు ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.
ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే తేమ శాతం తగ్గిపోవడం వల్ల రైతులకు నష్టం కలగకుండా వేగవంతమైన కొనుగోలు ప్రక్రియను అమలు చేస్తున్నామని చెప్పారు..
ప్రభుత్వ అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి తాలు సమస్యతో పాటు ఇతర సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని వివరించారు.
లారీల కొరత సమస్యను కూడా త్వరితగతిన అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు. గత నెల 22న హన్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని, ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నెల రోజులుగా కొనుగోలు జరగడం లేదని వ్యాఖ్యానించడం పూర్తిగా అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని గట్టిగా సూచించారు. సివిల్ సప్లై మంత్రి, జిల్లా అధికార యంత్రాంగం ప్రతీ క్షణం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు..
ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి గింజకు న్యాయం జరుగేలా కృషి చేస్తున్నామని అన్నారు.
అలాగే బీజేపీ పాలనపై విమర్శలు చేస్తూ ఎన్నికలు పూర్తయ్యాక గ్యాస్ ధరలను రూ.1000 వరకు పెంచిన చరిత్ర బీజేపీదేనని, వారి విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతులు, మధ్యతరగతి, పేద ప్రజలపై భారాన్ని మోపే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
విమర్శలు చేయడం కంటే ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని బీజేపీ నాయకులకు అనిల్ కుమార్ రెడ్డి హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేఖ బాబురావు, జిల్లా అధికారులు, ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్స్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
