లారీల కొరతను నివారించి ట్రాక్టర్ల కు అవకాశం ఇవ్వాలి
తరుగు పేరుతో కిలో 300 గ్రాములు ఎక్కువ తూకం చేయడాన్నీ తగ్గించాలి
మండలంలోనే గోడౌన్ సౌకర్యం కల్పించాలి
తాడూరు మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాల పరిశీలన
ప్రాథమిక సహకార కేంద్రం ముందు ధర్నా
మన తొలివెలుగు నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
తాడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం దగ్గర సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై ప్రాథమిక సహకార కేంద్రం ముందు ధర్నా చేశారు.

ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ.. తాడూరు ప్రాథమిక సహకార కేంద్రం ఏప్రిల్ 4న ప్రారంభించారని ఇప్పటి వరకు రెండు లక్షల 16 వేల బస్తాలు రాగా అందులో రెండు లక్షల 1802 బస్తాలు మక్కల సేకరణ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు మిల్లులకు 1, 25, 319 బస్తాలు తరలించారని, ఇంకా 76,000 బస్తాలు లారీలు లేక ఎగుమతి కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, లారీల కొరత తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.ఇంకా రెండు లక్షల వరకు బస్తాలు అవసరం ఉన్న ప్రభుత్వం నుంచి రావడంలేదని బస్తాల కోసం టోకెన్లు తీసుకుని వారాల తరబడి రైతులు ఎదురుచూస్తున్నారని బస్తాలు రాకపోవడంతో మార్కెట్లో 30 రూపాయలకు ఒక బస్తా చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుందని వెంటనే రైతులకు బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా లారీల కొరత తీవ్రంగా ఉందని ట్రాన్స్పోర్ట్ వాళ్లు లారీలను పంపించడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని, రోజుకు 20 లారీలు అవసరం అవగా రెండు నుంచి మూడు వరకు మాత్రమే లారీలు రావడంతో బస్తాలలో మక్కలు నింపుకొని రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని, అకాల వర్షాలు వస్తే నాని పోవడం తప్ప మరో మార్గం లేకుండా పోతుందని తెలిపారు. రైతులకు లారీలు లేకపోతే గ్రామాలలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్ల ద్వారా ఎగుమతి తీసుకోవాలని అందుకు అయ్యే రవాణా ఖర్చులు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అట్లాగే తరుగు పేరుతో మక్కల సేకరణలో కిలో మూడు వందల గ్రాములు అదనంగా తీస్తున్నారని దాని ద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తుందని తరుగును తగ్గించి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏప్రిల్ 4 నుండి సేకరించిన మక్కలకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని వెంటనే రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అంతటి కాశన్న, మండల నాయకులు శ్యాంసుందర్, వెన్నుపోతుల కాశన్న, కురుమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
