చోరీ కేసులను ఛేదించిన పోలీసులు
ఇద్దరిలో ఒకరు అరెస్ట్
వివరాలు వెల్లడించిన గద్వాల రూరల్ సీఐ శ్రీనివాస్
మన తొలివెలుగు జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో రిపోర్టర్ గడ్డం సుధాకర్ (07 ఆగస్ట్2026) :
గద్వాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని జమ్మిచేడు గ్రామంలో జరిగిన రెండు గృహ చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. వివరాలను గద్వాల రూరల్ సీఐ టంగుటూరి శ్రీనివాస్, రూరల్ ఎస్సై శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర ధారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లాకు చెందిన రితిక్ షిండేను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు గోయం పరారీలో ఉన్నాడు. ప్లాస్టిక్ సామాన్లు విక్రయించే పేరుతో గద్వాల పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఇళ్లను రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. బాధితులు కెంపు ఎల్ల బుజ్జమ్మ, ప్రేమల సరోజమ్మల ఇళ్లలో నుంచి చోరీ చేసిన రూ. 2. 45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ప్యాకెట్ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.

