చలో ఢిల్లీ సందర్భంగా ప్రచార యాత్ర
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర పిలుపు
మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ రిపోర్టర్ టీ. రమేష్ (07 ఆగస్ట్ 2026) :
భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున కేంద్రంలో ప్రభుత్వ మార్పును కోరుతూ సీపీఐ ప్రచార యాత్రలను శుక్రవారం కుత్బుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్టలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్వర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసు రత్నలు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యవసర వస్తువుల ధరల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో చమరు ధరలు తగ్గించకుండా పేద ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. అలాగే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి ఉన్న ఉద్యోగాలను తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల కోసం పోరాడే వారిని, ప్రశ్నిస్తున్న వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం తప్పించి ప్రజల సమస్యలను ఎక్కడా పరిష్కరించట్లేదని విమర్శించారు. ఎక్కడైనా తిరుగుబాటు వస్తే అక్కడ మతం, దేవుడు పేరున రాజకీయం చేయడం తప్ప ప్రజలకు అవసరమైనటువంటి వాటిని తీర్చడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోని నల్లడబ్బు సీజ్ చేసి ప్రతి ఒక్కరి భ్యాంక్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని గద్దెనెక్కారని గుర్తు చేశారు. హామీ ఇచ్చిన 15 లక్షల మాటేమో గానీ ప్రజల దగ్గర నుంచి టాక్స్ ల పేరుతో ప్రతి వ్యక్తి దగ్గర సంవత్సరానికి సుమారు ఒక లక్ష వసూలు చేస్తున్నారన్నారు. దానివల్ల ఇప్పటికే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే 15 లక్షలు కట్టినట్లు కనిపిస్తుందని వాపోయారు. అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయకుండా గత 70 సంవత్సరాల నుంచి లేని అప్పును బీజేపీ ప్రభుత్వం వచ్చినంక 100 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో కేవలం ఆదాని, అంబానీ లాంటి వ్యాపారవేత్తలే లాభపడ్డారు తప్ప.. ప్రజలు మాత్రం నష్టపోయారని అన్నారు. అందుకే దేశంలో మార్పు రావాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జగద్గిరిగుట్ట సీపీఐ పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభమై దేవమ్మ బస్తి, బీరప్ప నగర్ లో ప్రచారం నిర్వహించి ముగించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు, మహిళా సమైక్య అధ్యక్షురాలు హైమావతి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి, ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, యువజన నాయకులు కీర్తి, శ్రీకాంత్, వంశీ, సీపీఐ నాయకులు నరసయ్య, బక్కరి మల్లేష్, శ్రీనివాస్ చారి, నగేష్ చారి, బాల నర్సయ్య, సాగర్, దీప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

