సూరారం మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ
డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ గౌరవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరారం మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని కొనియాడారు. కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కార్మిక సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పిల్లల విద్య, వృద్ధాప్య పెన్షన్లు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాలను కోరారు. డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ వారికి గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సూరారం మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

