భక్తులతో కిటకిటలాడిన శ్రీ లలిత దేవి ఆలయం
భక్తులకు అన్నప్రసాద వితరణ
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రిపోర్టర్ విజయ్ కాంత్
బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో వెలసిన సప్తయాతన ఆలయంలోని శ్రీ చక్రపురవాసిని.. శ్రీ లలిత దేవి ఆలయంలో శుభముహూర్తంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని భక్తి భరితంగా ఆరాధించారు. ఉదయం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య కొనసాగగా, మహిళలు ప్రత్యేకంగా పాల్గొని కుంకుమార్చన నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా, మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కాకోజు పాండురంగ స్వామి మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
