నీటి నిల్వ ప్రాంతాలను, రద్దీ రహదారులను పరిశీలించిన జీహెచ్ఎంసీ, హైడ్రా ట్రాఫిక్ అధికారులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో నీటి నిల్వ ప్రాంతాలను, రద్దీ రహదారులను జీహెచ్ఎంసీ, హైడ్రా ట్రాఫిక్ అధికారులు పరిశీలించారు. నీటి నిల్వ ప్రాంతాలను, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాన్ని గుర్తించారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని 60వ డివిజన్లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లయిన విశాల్ మార్ట్ పరిసరాలు, చందనం చెరువు, ఎస్ వై ఆర్ కన్వెన్షన్ సమీపంలో రోడ్లపై నీరు నిలిచిపోతున్న పాయింట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించారు. వర్షాకాలంలో నియోజకవర్గ ప్రజలకు, వాహనదారుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మాధరి రమేష్ పాల్గొన్నారు.

