చిన్నారులకు కరపత్రాల పంపిణీ
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పూల్ బాగ్ క్రీడ మైదానంలో కుక్క కాటు నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు వీధి కుక్కలతో మెలిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది చిన్నారులకు కుక్క కాటు నివారణ, ప్రథమ చికిత్స, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కుక్కలు కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి, సమీప ఆసుపత్రిలో టీకా వేయించుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలను రెచ్చగొట్టడం, రాళ్లు విసరడం, తోక పట్టుకుని లాగడం చేయవద్దని, ఆహారం పెట్టేటప్పుడు దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు వివరించారు. కుక్క కాటుకు సంబంధించి ఎలాంటి అపోహలు నమ్మవద్దని, వైద్యుల సలహాలు మాత్రమే పాటించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్, మరియు జంగంమేట్ ఇంచార్జి, జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారి, డా ఎం డి వసీం, వెటర్నరీ ఆఫీసర్, డాగ్స్ క్యాచర్స్ రాజేందర్, సుధాకర్, జవీద్, పాల్గొన్నారు. వేసవి కాలంలో కుక్క కాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి డివిజన్లోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

