15 యూనిట్ల రక్తం యువత అందజేత
రక్తదానం మరొకరికి ప్రాణదానం
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గల బ్లడ్ బ్యాంక్ కు శుక్రవారం నర్సింగ్ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు యువత 15 యూనిట్ల రక్తాన్ని అందించి ఆదర్శంగా నిలిచినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ టీ. ఉషారాణి తెలిపారు. ప్రస్తుతం వేసవికాలం ఉండడంతో అధిక మొత్తం రక్తం యూనిట్లు అవసరం పడుతున్నాయని, ఆస్పత్రిలో నిత్యం జరిగే రక్తహీనత గల రోగులకు, గర్భవతులకు, డెలివరీ సమయంలో, సాధారణ ఆపరేషన్ అవసర సమయంలో, ఆర్థోపెడిక్ ఆపరేషన్ సమయంలో రక్తదానం చేసిన వారి యొక్క రక్తాన్ని అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలు, యువత నాగర్ కర్నూల్ ప్రభుత్వ రక్త నిధికి ఈ ప్రాంత వాసులు రక్తం అందజేసి, రోగులకు ప్రాణదానంగా సహాయపడాలని ఆమె సూచించారు. రక్తం అందజేసిన వారికి 90 రోజులలో యధావిధిగా రక్తం పునరుత్పత్తి జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. రక్తం కొరతగా ఉన్న దృష్ట్యా ఈ ప్రాంతవాసులు ప్రతిరోజు బ్లడ్ బ్యాంకులో ఉచితంగా రక్తదానం చేసి ధ్రువీకరణ పత్రం, రక్త పరీక్షల రిపోర్టులు పొందగలరని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఎంఓ డాక్టర్ ఏ రోహిత్ కుమార్, నర్సింగ్ అధికారులు కిరణ్, కే.రామాంజనేయులు, సాయినాథ్, హెడ్ నర్స్ రాధా, ల్యాబ్ టెక్నీషియన్లు బి. రాజు వెంకట్, దత్తాత్రేయులు, సిబ్బంది రామకృష్ణ హెల్త్ డెస్క్ ఇంచార్జ్ టీ.యాదగిరి నాగర్ కర్నూల్ యువత తదితరులు పాల్గొన్నారు.

