మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
అల్మాస్ గూడ లో ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా చెర నుంచి విడిపించాలని యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి హైడ్రా అధికారులను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్, బడంగ్ పేట్ సర్కిల్ 16, నాదర్ గూల్ డివిజన్ 57 అల్మాస్ గూడ గ్రామంలోని సర్వే నెంబర్ 30, 31, 32, 33, 34, 35, 36 లో పార్కు స్థలం కబ్జా విషయంపై ఆయన హైడ్రా అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామిడి కళావతి కాలనీకి బీ ఎస్ ఆర్ కాలనీ కి సంబంధించినటువంటి పార్కు కబ్జాకు గురి కావడం జరిగిందన్నారు. రాత్రికి రాత్రి చుట్టు ప్రహరీ గోడ నిర్మించి పార్క్ స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందన్నారు. వెంటనే పార్కుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ పార్కులు కబ్జాలు కాకుండా హైడ్రా ఆధికారులు ఉక్కు పాదం మోపాలన్నారు.
